IFR ను పురస్కరించుకొని విఎంఆర్డిఏ పర్యాటక ప్రదేశాల్లో చైర్మన్, కమిషనర్ పర్యటన

 



కడలి న్యూస్,విశాఖపట్నం:– 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18, 19 వ తేదీలలో విశాఖలో జరుగుతున్న (IFR) అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసముల సందర్భంగా  విఎంఆర్డిఏ నిర్వహిస్తున్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను, పచ్చదనం పెంపునకు సంబంధించిన పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని విఎంఆర్డిఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ఆదేశించారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో ప్రగతిని క్షేత్ర స్థాయిలో చైర్మన్  కమిషనర్ లు కలిసి సంయుక్తంగా పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో జరిగే అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల సమీక్ష ను విజయవంతం చేసేలా పలు సూచనలు చేశారని చైర్మన్  పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  సూచనలతో వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని పర్యాటక ప్రాంతాలని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అన్నీ చోట్ల ఎక్కడక్కడ డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి, శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెట్రోపాలిటన్ కమిషనర్  తేజ్ భరత్  మాట్లాడుతూ పచ్చదనం మరింత పెంచాలని, సందర్శకులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అధికారులతో కుర్సుర సబ్మెరైన్ మ్యూజియం, సీహారియర్, యుహెచ్3హెచ్  హెలికాప్టర్ మ్యూజియం, టి యు –142 యుద్ధ విమాన మ్యూజియంల వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా కైలాసగిరి పై అభివృద్ధి పనులను, తెన్నేటి పార్క్ నందు పనులను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు