హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి... హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం
యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించండి
త్వరలో శాశ్వత కుల ధృవపత్రాలు
విద్యా రుణాలపై వడ్డీ భారం తగ్గించేలా త్వరలో కొత్త పథకం
ప్రాంతాల మధ్య అభివృద్ధిలో పోటీ
తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు
కడలి న్యూస్:– సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు... వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంక్షేమం, పీ4, సూపర్ సిక్స్ అంశాలపై సమీక్షించారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు. సంక్షేమం – అభివృద్ధికి సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నాం.. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం అని సిఎం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించాం అని తెలిపారు. అయితే, ఆర్ధికసాయం లబ్దిదారులకు అందటంలో తలెత్తిన చిన్నచిన్న లోటు పాట్లను కలెక్టర్లు సరిదిద్దాలని సూచించారు. ఇక, తొలి సంతకంగా చేసిన మెగా డీఎస్సీ కింద యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అయితే, జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే ప్రైవేటు రంగంలోనూ జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అని ఆయన అన్నారు. ఇప్పటికే 6 వేలకు పైగా పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీశక్తి విజయవంతమైంది. ఈవీ బస్సుల ద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది. బస్టాండ్లలో కమర్షియల్ కాంప్లెక్సుల ఏర్పాటు, కార్గో ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు అని వెల్లడించారు.
పేదల సేవలో ద్వారా ఏటా రూ.33 వేల కోట్ల వ్యయం చేస్తున్నాం. పీ4 ద్వారా పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. అక్టోబరు 1వ తేదీన 3లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేయనున్నానం అని సిఎం పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్ గూగుల్ కూడా వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్లు పెట్టడంతో పాటు సీనరేజి, రాయల్టీలో మినహాయింపు ఇస్తాం. ఇమామ్, మౌజన్లకు కూడా గౌరవవేతనం ఇస్తున్నాం. విజయవాడలో హజ్హౌస్ త్వరలోనే పూర్తవుతుంది. హజ్ యాత్రికులకు రు.1 లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నాం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాన్ని ప్రభుత్వం ఎప్పుడూ చేపట్టదు అని ఆయన స్పష్టం చేశారు.
ఇక, కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం… అన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లోనూ బ్రాహ్మణులకు చోటు కల్పించాం అని చంద్రబాబు అన్నారు. నిర్మాణ రంగంలో వర్కర్ల సంక్షేమం కోసం కూడా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. శాశ్వత కులధృవీకరణ పత్రం కూడా త్వరలోనే జారీ చేస్తున్నాం. కేజీ టు పీజీ పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చాం. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెడతామన్నారు. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలపై విచారణకు ఆదేశించాం. 217 జీవో రద్దు చేశాం.. మత్య్సకారుల సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నాం.. ఎవరికీ అన్యాయం జరక్కుండా ఎస్సీ వర్గీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశాం.. జీవో నెంబరు 3ని సుప్రీం రద్దు చేసింది.. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయగలుగుతామో కార్యచరణ సిద్ధం చేయాలి అని అన్నారు. టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటు ద్వారా ఆర్ధిక ఎకోసిస్టం ఏర్పాటు అవుతుంది.. ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించేలా పాలసీలను తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రీన్ ట్యాక్స్ను కూడా రద్దు చేశాం. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాం.. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం. అర్చకులకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాం.. వేద విద్యార్ధులకు రూ.3 వేలు ఇస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తున్నాం అని సిఎం వెల్లడించారు..